ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి, క్రియాశీల రాజకీయాల్లో, టీవీ చర్చల్లో పాల్గొనడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని జై భీమ్ రావు భారత్ (JBP) పార్టీ ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి కార్యాలయం తక్షణమే విచారణ జరపాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు లేఖ ద్వారా సిఫారసు చేసింది. ఫిర్యాదు ప్రకారం, డిప్యూటీ స్పీకర్ తన హోదాను ఉపయోగించి ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేస్తారని జీబీపీ పార్టీ పేర్కొంది.
వాస్తవానికి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు తీసుకున్న వారు రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అయితే రఘురామకృష్ణరాజు కొద్దికాలంగా మీడియా సమావేశాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం, రాజకీయ అంశాలపై ప్రత్యక్షంగా స్పందించడం ప్రారంభించారు. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పార్టీ ఫిర్యాదు చేసింది.
తాజాగా రాష్ట్రపతి కార్యాలయం సూచనతో రఘురామపై చర్యలు తీసుకోవాలని సిఫారసు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పందన ఇవ్వబోతుందో వేచి చూడాల్సి ఉంది. రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని రాష్ట్ర రాజకీయాలపై ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.









