భారత వైమానిక దళం (IAF)తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదు తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు పూర్తిగా సిద్ధమయ్యాయని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అధికారికంగా ప్రకటించింది. స్వదేశీంగా తయారైన ఈ ఆధునిక యుద్ధ విమానాల కోసం ఐఏఎఫ్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈ ప్రకటన కీలకంగా మారింది. మార్కెట్లో, సోషల్ మీడియాలో డెలివరీ ఆలస్యంపై వస్తున్న కథనాలకు సమాధానంగా HAL ఈ వివరణ ఇచ్చింది.
HAL విడుదల చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుతం ఐదు తేజస్ మార్క్ 1A విమానాలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయి. ఒప్పందంలో పేర్కొన్న సాంకేతిక ప్రమాణాలు, అత్యాధునిక సామర్థ్యాలు, ఆపరేషనల్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాలను తయారు చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ విమానాలు ఆధునిక రాడార్ సిస్టమ్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలతో పాటు అత్యుత్తమ ఆయుధ వ్యవస్థలను కలిగి ఉన్నాయని పేర్కొంది.
ఈ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించేందుకు అవసరమైన అన్ని ప్రక్రియలు తుది దశకు చేరుకున్నాయని HAL తెలిపింది. డెలివరీలో ఆలస్యం జరుగుతోందన్న వార్తల్లో నిజం లేదని, కొన్ని సాంకేతిక మరియు పరిపాలనా ప్రక్రియల కారణంగానే సమయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఐఏఎఫ్తో పూర్తి సమన్వయంతోనే డెలివరీ షెడ్యూల్ అమలు చేస్తున్నామని పేర్కొంది.
తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు భారత రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి మైలురాయిగా నిలుస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఇది పెద్ద బలంగా మారనుంది. భవిష్యత్తులో మరిన్ని తేజస్ విమానాలను వేగంగా తయారు చేసి ఐఏఎఫ్కు అందించడమే లక్ష్యంగా HAL ముందుకు సాగుతోందని సంస్థ అధికారులు తెలిపారు.









