భద్రాచలం పట్టణం ఈ మధ్య కాలంలో నేరాలకు నిలయంగా మారింది. వారం క్రితం నడిరోడ్డు పైన ఒక వ్యక్తిని కొంతమంది యువకులు హత్యచేయడం జరిగింది. ఆ ఘోర ఘటన మరువకముందే, బుధవారం మరో హత్యాయత్నం జరిగింది. ఈసారి బాధితురాలి భర్త తన భార్యపై దాడి చేసాడు.
వివరాల ప్రకారం, చర్ల మండలానికి చెందిన సత్యం బుధవారం పాత మార్కెట్ ప్రాంతంలో తన భార్యను కత్తితో గాయపరచి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరి సత్యంను అదుపులోకి తీసుకున్నారు.
భర్త దాడి చేసిన వెంటనే భార్యను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె స్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటన పట్ల భద్రాచలం నగరంలో తీవ్రమైన ఆందోళన ఏర్పడింది.
సత్యం దగ్గర నుండి ఒక లేఖ వెలుగులోకి వచ్చింది, దీనిలో ఆయన తన భార్యను ఏప్రిల్లో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడని, ఆ తరువాత ఆమె ఇంటికి రాకుండా, తనను మరియు ముగ్గురు పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతుందని పేర్కొని, అందుకే హత్య చేసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









