ఆసియాలోనే అతి పొడవైన రోప్వే హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో నిర్మితమవుతోంది. మొత్తం 13.79 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక అభివృద్ధికి ఇది మరింత ఊతమివ్వనుంది. తారాదేవి-సిమ్లా రోప్వే ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పీపీపీ మోడల్లో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
రోప్ వే అండ్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీని నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. మొత్తం రూ. 1,734.40 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం జరుగుతోంది. ఇది ప్రపంచంలోనే రెండో అతి పొడవైన రోప్వే కానుంది. ప్రస్తుతానికి అత్యంత పొడవైన రోప్వే బొలీవియాలో 32 కిలోమీటర్ల పొడవున ఉంది.
మాతా తారాదేవి-సంజౌలి మధ్య ఈ రోప్వే నడుస్తుంది. సిమ్లా పరిసరాల్లోని 15 ప్రధాన స్టేషన్లను ఇది అనుసంధానిస్తుంది. ప్రతి గంటకు సుమారు 2,000 మంది ప్రయాణించగలరు. ఇందులో మొత్తం 660 కేబిన్లు ఉంటాయి. ఒక్కో కేబిన్లో 8 నుంచి 10 మంది వరకు ప్రయాణించేందుకు వీలుంది.
ప్రతి రెండుమూడు నిమిషాలకు క్యాబిన్లు స్టేషన్లకు చేరుకుంటాయి. ఈ రోప్వే పర్యాటకానికి గణనీయంగా మద్దతు ఇవ్వనుంది. అంతేకాదు, స్థానిక ప్రజలకు కూడా ప్రయాణ సౌలభ్యం కలిగించనుంది. భవిష్యత్తులో ఇది సిమ్లాలో ప్రధాన రవాణా మార్గంగా మారే అవకాశముంది.









