చైనాలో వాయవ్య, నైరుతి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. వరదల కారణంగా ఇప్పటివరకు ఆరుగురు మరణించారని అధికారులు ధృవీకరించారు. వరద తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం పలు ప్రావిన్సుల్లో సహాయక చర్యలను వేగవంతం చేసింది.
గుయిజౌ ప్రావిన్సులోని రోంగ్జియాంగ్ కౌంటీ తీవ్రంగా ప్రభావితమైంది. వారం వ్యవధిలో రెండుసార్లు భారీ వరదలు సంభవించడం కారణంగా ఇక్కడ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ప్రముఖమైన ‘విలేజ్ సూపర్ లీగ్’ ఫుట్బాల్ స్టేడియం ఐదు రోజుల్లో రెండుసార్లు పూర్తిగా నీటమునిగింది. వరదల ధాటికి గ్రామాలన్నీ నీటిలో కొట్టుకుపోతున్న పరిస్థితి నెలకొంది.
చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ క్విన్ఘై ప్రావిన్సులో కొత్తగా లెవెల్-4 అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాబోయే మూడు రోజులపాటు ఇక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఎల్లో రివర్ ఉపనదుల నీటిమట్టం భారీగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే సిచువాన్, గాన్సు, చాంగ్కింగ్ ప్రావిన్సుల్లో లెవెల్-4 హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చెంగ్డు నగరంలో కొండచరియలు విరిగిపడటంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. మరో పది ప్రావిన్సులకు కూడా భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయగా, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైనాలో విపత్తుల తీవ్రతను బట్టి లెవెల్-1 నుండి లెవెల్-4 వరకు హెచ్చరికలు జారీ చేస్తారు, అందులో లెవెల్-1 అత్యంత ప్రమాదకరమైనది.









