లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’ (Dandora). మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మానికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సామాజిక అంశాల్ని ప్రతిబింబించే కథతో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు మురళీకాంత్ మీడియాతో ముచ్చటించారు. తన సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘‘మాది మెదక్. మంచి సినిమా తీయాలనే కోరికతోనే ఈ రంగంలోకి వచ్చాను. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ సినిమాల మీద ప్రేమ తగ్గలేదు. రొటీన్ లైఫ్ నాకిష్టం లేకపోవడంతో జీవితంలో రిస్క్ తీసుకుని సినిమాల వైపు అడుగులు వేశాను’’ అని తెలిపారు.
‘దండోరా’ కథ ఆలోచన ఎలా వచ్చిందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘నా మెదడులో ఎన్నో కథలు ఉన్నాయి. ప్రేమ కథలను నెరేట్ చేయడం చాలా కష్టం అనిపించింది. అందుకే ఒక బలమైన కాన్సెప్ట్తో, సమాజంలోని మూలల్లో ఉన్న కథను చెప్పాలనే ఉద్దేశంతో ‘దండోరా’ తెరకెక్కించాను. పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో జీవన విధానాలు తెలుస్తాయి. సమాజంలోని అసమానతలను ప్రతిబింబించాలనే ఆలోచనతో ఈ కథను రూపొందించాను’’ అని వివరించారు.
ఇక ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఏమి ఆశించాలన్న అంశంపై మాట్లాడుతూ.. ‘‘‘దండోరా’ అనే టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో ఎన్నో ఊహాగానాలు వస్తాయి. కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అవుతారు. మార్క్ కె రాబిన్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. స్క్రీన్ప్లే ప్రేక్షకులను కదిలిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఓ మంచి అనుభూతితో బయటకు వస్తారు’’ అని మురళీకాంత్ తెలిపారు. దర్శకుడి వ్యాఖ్యలతో ‘దండోరా’పై సినీ ప్రియుల్లో అంచనాలు మరింత పెరిగాయి.









