భారత్-పాక్ యుద్ధం ఆపడంలో ట్రంప్‌కు పాత్రలేదన్న జైశంకర్

Jaishankar dismisses Trump’s claims of halting Indo-Pak war, says Pakistan itself proposed ceasefire.

భారత్-పాక్ యుద్ధం సమయంలో తానే మధ్యవర్తిగా వ్యవహరించి పరిస్థితిని చల్లబరిచానంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తిప్పికొట్టారు. ట్రంప్ చెప్పినట్లు ఆయన చేసిన గొప్పతనంలో వాస్తవం లేదని, నిజానికి కాల్పుల విరమణకు పాకిస్థానే ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ‘న్యూస్‌వీక్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ విషయాలను వెల్లడించారు.

జైశంకర్ వివరించిన ప్రకారం, మే 9వ తేదీ రాత్రి పాకిస్థాన్ నుంచి భారత్‌పై పెద్ద దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేసి హెచ్చరించారు. ఆ సమయంలో తాను మోదీతోపాటే ఉన్నట్టు జైశంకర్ తెలిపారు. ఈ హెచ్చరికకు స్పందనగా మోదీ “పాక్ దాడి చేస్తే దీటుగా బదులిస్తాం” అని అమెరికా ప్రతినిధికి స్పష్టం చేసినట్టు చెప్పారు. ఆ రాత్రే పాక్ దాడికి ప్రయత్నిస్తే భారత బలగాలు దాన్ని సమర్థంగా తిప్పికొట్టినట్టు వివరించారు.

దీనికి మరుసటి రోజు ఉదయం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తనకు ఫోన్ చేసి, పాక్ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పినట్టు జైశంకర్ చెప్పారు. ఆ వెంటనే అదే రోజు మధ్యాహ్నం పాక్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఖసిఫ్ అబ్దుల్లా, భారత్ డీజీఎంవో రాజీవ్ ఘాయ్‌కు నేరుగా ఫోన్ చేసి, కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇదే అసలు కారణమని, ట్రంప్ చెప్పినట్టు అమెరికా రోల్ ఏదీ లేదని జైశంకర్ స్పష్టంచేశారు. వాణిజ్యం, కాల్పుల విరమణకు సంబంధం లేనని కూడా ఆయన తేల్చి చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లో పహల్గామ్ దాడిపై మాట్లాడుతూ, జైశంకర్ దాన్ని ఆర్థిక యుద్ధ చర్యగా అభివర్ణించారు. కశ్మీర్‌లో అభివృద్ధి, శాంతి వాతావరణాన్ని ఉగ్రవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ భరించలేకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని ఆయన తెలిపారు. పర్యాటక రంగాన్ని దెబ్బతీయడానికి ఉగ్రవాదులు మతం అడిగి పర్యాటకులను లక్ష్యం చేసుకుని కాల్చారని వివరించారు. ఈ దాడి తర్వాత ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని భారత్ నిర్ణయించుకుందని తెలిపారు.

భారత్ ఉగ్రవాదంపై తన వైఖరి మారబోదని, ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహించే ప్రభుత్వాలకు సరైన బుద్ధి చెప్పేందుకు దేశం వెనుకాడదని జైశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఎలాంటి అణ్వస్త్ర బెదిరింపులకు భయపడదని, దేశ భద్రత కోసం అవసరమైతే తగిన చర్యలు తీసుకోవడంలో సంకోచం ఉండదని ఆయన గట్టిగా హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share