ఎంపీ రఘునందన్‌రావుకు అదనపు భద్రత ఏర్పాటు

Following Maoist threats, Telangana police have decided to provide additional security and escort cover to MP Raghunandan Rao.

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌రావుకు మావోయిస్టుల బెదిరింపులు రావడంతో పోలీసు శాఖ సీరియస్‌గా స్పందించింది. ఇటీవల ఆయనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌లో ‘పీపుల్స్ వార్ మావోయిస్టు’ అని పరిచయం చేసుకుంటూ బెదిరించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు, రఘునందన్‌రావుకు ప్రాణహానీ ముప్పు ఉండొచ్చని భావించి, ఆయనకు అదనపు భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్పీలకు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భద్రత కల్పన విషయంలో ఎలాంటి పొరపాటూ జరగకూడదని సూచిస్తూ, రఘునందన్‌రావు పర్యటనల సమయంలో ప్రత్యేక పోలీసు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిష్యత్తులో కూడా ఆయన కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలు కూడానే ఉంటాయని తెలుస్తోంది.

బెదిరింపు కాల్ ఘటన సోమవారం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ రఘునందన్‌రావు హాజరైన సమయంలో ఆయన పీఏకు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి సోమవారం సాయంత్రంలోగా హతమారుస్తామంటూ హెచ్చరించాడు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని పేర్కొంటూ బెదిరింపులకు దిగాడు. వెంటనే దీనిపై ఎంపీ రఘునందన్‌రావు డీజీపీతో పాటు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనను అత్యంత గంభీరంగా తీసుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. డిజిటల్ ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, బెదిరింపు కాల్ చేసిన నంబర్‌కు చెందిన పూర్తి సమాచారం ట్రేస్ చేయడానికి కృషి చేస్తున్నారు. ఇలాంటి ముప్పుల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు భద్రతను మరింత బలపర్చాలని తెలంగాణ పోలీసు శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. రఘునందన్‌రావు భద్రత విషయంలో ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share