హైదరాబాద్ ఐ మాక్స్ మైదానంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నాలుగు నెలలుగా గుట్టుగా జరుగుతున్న బ్రౌన్ షుగర్, గంజాయి దందా బయటపడింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐ మాక్స్ గ్రౌండ్ లో ఫిరోజ్ బిన్ అలీ, సులేమాన్ ఖాన్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించి విచారించారు. వారి వద్ద 100 గ్రాముల బ్రౌన్ షుగర్ మరియు 1350 గంజాయి పట్టుబడింది.
విచారణలో ఫిరోజ్, సులేమాన్ సమాచారం ప్రకారం, మహ్మాద్ గులాం నుండి గ్రాముకు 5 వేల రూపాయల వద్ద బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి మత్తు బాబులకు గ్రాముకు 8 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు ఈ ఆధారాలతో మహ్మాద్ గులాం ను అదుపులోకి తీసుకున్నారు. గులాం మేడ్చల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సమయంలో మౌలాలీ దర్గా వద్ద ఒడిశాకు చెందిన అఫ్సర్ పరిచయం ద్వారా ఈ వ్యాపారంలో పాల్గొన్నట్లు గుర్తించారు.
అఫ్సర్, గులాం కలసి ఒడిశా జాలేశ్వర్, బాలశోర్ నుంచి బ్రౌన్ షుగర్ మరియు గంజాయిని తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులకు వివరించారు. ముగ్గురి అరెస్ట్ తోపాటు బ్రౌన్ షుగర్, గంజాయి, 7 మొబైల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా నగరంలో డ్రగ్ వ్యాపారంపై పోలీసులు కచ్చితమైన చర్యలు తీసుకున్నారు.









