మున్సిపల్ ఎన్నికల వేళ పరకాల మండలంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 22 వార్డుల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పరకాల పట్టణంలోని 19వ వార్డు వికాస్ నగర్ కాలనీలో చోటు చేసుకున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వికాస్ నగర్ కాలనీలో కొన్ని ఇళ్ల పక్కన ఉన్న కట్టెల పొదల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు పడివుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ జెండాలు ఇలాంటి పరిస్థితుల్లో కనిపించడం వెనుక అంతర్యం ఏమిటని కాలనీవాసులు వాపోతున్నారు. ఇది కావాలని చేసిన పనేనా? లేక అంతర్గత రాజకీయాల ఫలితమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్డు అభ్యర్థి, పార్టీపై స్థానికంగా అసంతృప్తి ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అధికార ప్రభుత్వం ఉన్నప్పటికీ వికాస్ నగర్ కాలనీలో అనుకున్న స్థాయిలో సంక్షేమ పథకాలు అందలేదన్న భావన ప్రజల్లో ఉందనే ప్రచారం సాగుతోంది. అదే కారణంగా ప్రజల ఆగ్రహం ఇలా బయటపడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏది ఏమైనా, ప్రచార జోరులో కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టెల పొదల్లో పడేయబడటం ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చినట్టే కనిపిస్తోంది. ప్రజలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారనే సంకేతమా? లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్రనా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనతో 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.









